ఓసీ సామాజిక వర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి/పోలవరం: నియోజకవర్గంలోని ఓసీ సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బర్రింకలపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఓసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో ఓసీ వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై ఎమ్మెల్యే నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్య, ఉపాధి, మౌలిక వసతులు, వ్యవసాయం, గృహ నిర్మాణం వంటి అంశాలపై నాయకులు చేసిన సూచనలు, అభ్యర్థనలను శ్రద్ధగా విన్న ఆయన, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందిస్తూ సమయం కేటాయించినందుకు సమావేశంలో పాల్గొన్న ఓసీ సామాజిక వర్గ నాయకులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.