చింతలపూడిలో ఎక్సైజ్ శాఖ దాడులు – నాటు సారాయి, బెల్ట్ షాపు కేసుల్లో బైండ్ ఓవర్ బాండ్లు


ఏలూరు జిల్లా,చింతలపూడి: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఏలూరు శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్, డీపీఈఓ ఏలూరు జిల్లా ఆవులయ్య ఆదేశాల మేరకు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో నాటు సారాయి కేసులో పాత నిందితురాలైన కాగిత నాగేశ్వరమ్మ అనే మహిళను, అలాగే శంకుచక్రపురం గ్రామానికి చెందిన కలవకొల్లు దుర్గారావును అదుపులోకి తీసుకుని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ చింతలపూడి వారి ఎదుట హాజరు పరచారు. 129 BNSS చట్టం ప్రకారం తహసీల్దార్ వారు వీరిపై బైండ్ ఓవర్ బాండ్ విధించారు.

అదేవిధంగా పాత బెల్ట్ షాపు కేసుల నిందితులైన లింగపాలెం మండలం లింగపాలెం గ్రామానికి చెందిన బొర్రా సర్వేశ్వరరావు, కె. గోకవరం గ్రామానికి చెందిన నాయుడు వెంకటేశ్వరరావు, ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన మట్టా సతీష్, దేసిన వెంకటేశ్వరరావు, తువ్వచిలకరాయుడుపాలెం గ్రామానికి చెందిన చలమాల వెంకటేశ్వరరావు, వెస్ట్ యడవల్లి గ్రామానికి చెందిన రాయల వజ్రం అనే ఆరుగురు వ్యక్తులను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ లింగపాలెం వారి ఎదుట హాజరు పరచి 129 BNSS ప్రకారం బైండ్ ఓవర్ బాండ్ విధించినట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు.

ఇదే రోజున చింతలపూడి నుంచి పాత చింతలపూడి వైపు వెళ్లే రోడ్డులో నాటు సారాయి నేరాల నియంత్రణ కోసం ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బేతి ప్రభాకర్ అనే వ్యక్తి హీరో హోండా మోటార్ సైకిల్‌పై రెండు లీటర్ల నాటు సారాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. మోటార్ సైకిల్‌తో సహా అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ వెల్లడించారు.