అన్నివర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, డిసెంబర్ 13: అన్నివర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. శనివారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు.


ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. “నేనున్నాను” అంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాలనే సదాశయంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎదురయ్యే అవాంతరాలను లెక్కచేయకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.