పొగాకు పై ఎక్సైజ్ డ్యూటీ రద్దు - ధన్యవాదాలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.


.. పొగాకుపై విధించిన 18% ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసిన కేంద్రం.

‎.. 2025 డిసెంబర్ నాటి నిర్ణయానికి సవరణ.
‎.. ఫలించిన ఏలూరు ఎంపీ విజ్ఞప్తులు.
‎.. పొగాకు రైతాంగంలో హర్షాతిరేకాలు.
‎ఏలూరు/ఢిల్లీ, ఫిబ్రవరి 03: బ్రాండ్ లేని మరియు రిటైల్ ప్యాకింగ్ లేని తయారీ చేయని పొగాకు (unmanufactured tobacco)పై విధించిన 18% ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2025 డిసెంబర్ నాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన విజ్ఞప్తులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల, రైతుల విజ్ఞప్తులను మన్నించి పొగాకుపై సుంకాన్ని తొలగించినందుకు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, ప్రభుత్వానికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

‎రైతుల పోరాటం, ఎంపీ మద్దతు..
‎పొగాకు రైతులు, రైతు సంఘాల నేతలు జనవరి మొదటి వారంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఏలూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సుంకాల పెంపు ప్రభావంతో పొగాకు వేలం జరిగే ఫిబ్రవరి-మార్చిలో కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోతే ధరలు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆ సందర్భంగా ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రధానికి కేంద్ర మంత్రులకు లేఖలు రాయటంతోపాటు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి సమస్యను వివరించారు. 

ఎంపీ సూచన మేరకు ఏపీకి చెందిన రైతులు కూడా కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్ధిక మంత్రిని, ఎంపీ లను కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ ట్యాక్సుల పెంపుతో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ కొత్త పన్నులను పునఃపరిశీలించాలని విన్నవించారు. దీనిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏలూరు ఎంపీ చొరవ  ఫలితంగానే పొగాకు రైతులకు ఊరట కలిగించే నిర్ణయం వచ్చిందని భావిస్తున్నారు.  

పొగాకుపై, పొగాకు ఉత్పత్తులపై అదనంగా విధించిన జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రధాన మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, వాణిజ్య శాఖ మంత్రికి, ఇటీవల తాను లేఖ రాసిన విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో గుర్తు చేశారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్లూక్యూర్డ్‌ వర్జీనియా (FCV) పొగాకు పండించే రైతుల కష్టాలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రులకు, ప్రధానికి సుదీర్ఘ లేఖలు రాసారు. 

అందులో, ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్న పొగాకు రైతులకు ఈ పన్ను పెంపు తీరని భారంగా మారుతుందని ఎంపీ పేర్కొన్నారు. 2014లో 22 శాతం పన్ను పెంచినప్పుడే ముడి పొగాకు ధరలు 20 నుంచి 30 రూపాయలకు తగ్గాయని, ఇప్పుడు పెంచిన పన్నుల వల్ల కిలోకు 60 నుంచి 70 రూపాయల వరకు తగ్గిపోతాయని ఎంపీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు జింబాబ్వే, మలావి, బ్రెజిల్, మొజాంబిక్ వంటి దేశాలలో రికార్డు స్థాయిలో పొగాకు ఉత్పత్తి జరుగుతున్న కారణంగా భారత్ నుంచి ఎగుమతి మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. 

ఎక్సైజ్ సుంకం పెంపు ఇతర దేశాల నుంచి అక్రమ పొగాకు రవాణాకు కూడా కారణం అవుతుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పెంచిన ఎక్సైజ్ సుంకాలను సమీక్షించాలని కేంద్ర మంత్రులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. 
‎రైతులకు ఊరట: 
ఎంపీ విజ్ఞప్తులు, రైతుల ఆందోళనలతో కేంద్రం పునః పరిశీలన చేసి, పెంచిన పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, సిగరెట్లపై పన్నులు యథాతథంగా కొనసాగుతాయి. ఈ మినహాయింపు బ్రాండ్ పేరు లేని మరియు రిటైల్ అమ్మకం కోసం ప్యాక్ చేయని పొగాకుకు మాత్రమే వర్తిస్తుంది. అధిక పన్నుల కారణంగా రైతుల ఆదాయం తగ్గుతుందని ఆందోళనల నేపథ్యంలో, ఈ నిర్ణయం పొగాకు సాగుదారులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర నిర్ణయం పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ఈ చర్య పొగాకు మార్కెట్‌ను స్థిరీకరించడానికి మరియు రైతుల జీవనోపాధిని రక్షించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇది పొగాకు రైతులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది.
‎పొగాకు రైతుల హర్షం..
‎పన్ను పెంపుతో  రైతులకు జరిగే నష్టాన్ని ప్రధాని దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకొనేలా కృషి చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా, ఇతర పార్లమెంట్ సభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పొగాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.