ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి – ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు: ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.


సోమవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే చంటి, తనను కలిసేందుకు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఒక విభిన్న ప్రతిభావంతునికి ట్రైసైకిల్‌ను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరాలనే సదాలోచనతోనే తాను ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ వస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రజాసమస్యలకు పరిష్కారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, టీడీపీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.