ఏలూరు అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు… రహదారుల పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే బడేటి చంటి


వంగాయగూడెం–పెదపాడు మార్గం రహదారి నిర్మాణంలో వేగం… 3 కోట్ల వ్యయంతో నాణ్యతా ప్రమాణాలపై ఎమ్మెల్యే దృష్టి

వైసీపీ నేతల విమర్శలకు చంటి కౌంటర్—“గతంలో గుంతల్లో టీ తాగిన వారు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు”


ఏలూరు, డిసెంబర్‌ 3: బృహత్తర ప్రణాళికలతో ఆదర్శవంతమైన అభివృద్ధికి నాంది పలికామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఇదేక్రమంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రాధాన్యతాక్రమంలో ఆ ప్రణాళికల్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇవేమి పట్టని వైసిపి నాయకులు కేవలం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, గత ఐదేళ్ళలో విధ్వంసం సృష్టించిన వారికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని మండిపడ్డారు. 

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధిపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలినుండి ప్రత్యేక ప్రాధాన్యత చూపుతూ వచ్చారు. అవసరమైతే సంబంధిత శాఖా మంత్రి దృష్టికే నేరుగా రహదారుల సమస్యలను దఫదఫాలుగా తీసుకెళ్తూ వచ్చిన ఆయన.. ఆ దిశగా సక్సెస్‌ అవుతూ వచ్చారు. ఇదేక్రమంలో ఇటీవల జరిగిన డిఆర్సీ మీటింగ్‌లో సైతం రహదారుల నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఏలూరు వంగాయగూడెం నుండి పెదపాడు వెళ్ళే ప్రధానమార్గం గుంతలమయంగా ఉందని, పెదపాడు వైపు నుండి కాకుండా ఏలూరు వైపు నుండి రహదారి నిర్మాణం చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. 

ఆ దిశగా విజయం సాధించిన ఆయన.. బుధవారం అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. వంగాయగూడెం సెంటర్‌ నుండి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దు వరకు దాదాపుగా 2.3 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. అందులో 1.6కిలో మీటర్లు బిటి రోడ్డు, మిగిలిన 7వందల మీటర్లు సిమ్మెంట్‌ రహదారి నిర్మించేలా అధికారులకు, సంబంధిత కాంట్రాకర్టర్లకు ఆయన సూచనలు చేశారు. దీంతో 3కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో వంగాయగూడెం నుండి జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించిన ఆయన.. నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి నియోజకవర్గాన్ని కలుపుతూ ఉన్న అన్ని రహదారులను నిర్మించామన్నారు. అలాగే ప్రాధాన్యతాక్రమంలో అంతర్గత రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తూ వస్తున్నామన్నారు. ఇవేమీ పట్టని వైసిపి నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారని, గతంలో ఇక్కడి గుంతల్లో టీ తాగిన వారు ఇప్పుడు నిర్మిస్తోన్న రోడ్డుపై దొర్లుతారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అర్థంపర్థంలేని విమర్శలను కట్టిపెట్టి హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. రానున్న రోజుల్లో కోట్లాది రూపాయల నిధులతో ఏలూరు నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు.



ఆయన వెంట రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్‌ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, చోడే వెంకటరత్నం, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, డివిజన్ ఇంచార్జ్ గరికిముక్కు ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దాడ రమణ, నందారపు రాధా, లలిత, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ వలీ, డిఈ శ్రీకర్‌, ఈఈ కిషోర్‌ బాబు జి, ఏఈఈ శేషు కుమార్‌, టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు అమరావతి అశోక్‌ తదితరులు ఉన్నారు.