ఏలూరు జిల్లా, ఏలూరు(ELURU): ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు IADP హాల్లో రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ షేక్ హబీబ్షా(SHAIK HABIB SHA) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దేశానికి వెన్నెముకలని, వారి కష్టాన్ని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన రైతులను ప్రత్యేకంగా సత్కరించి ప్రశంసించారు. రైతుల కృషి సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి బి. వెంకటేష్(VENKATESH) మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయని వివరించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రైతులు రసాయన రహిత సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతుల హక్కుల కోసం పోరాడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్(CHOWDARI CHARAN SING) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రైతుల దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.















Social Plugin