పోలవరం నియోజకవర్గంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం

ఏలూరు జిల్లా, పోలవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోలవరం పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గానికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గూటాల గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, ప్రాంత సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం పోలవరం నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సౌకర్యం, ఉపాధి అవకాశాలు, యువతకు ఉద్యోగావకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డ మనగు రవికుమార్, జిల్లా కార్యదర్శి కరాటం సాయి, పోలవరం మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, కొయ్యలగూడెం మండల అధ్యక్షుడు తోట రవి, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఏవి, మొగళ్ళ హరిబాబు, అయ్యప్ప, మామిడిపల్లి స్వాతి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో జనసైనికులు, అభిమానులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.