దెందులూరులో పారిశ్రామిక ప్రగతికి చర్యలు – సోమవరపాడు వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ముందడుగు


ఏలూరు జిల్లా, దెందులూరు: నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ దిశగా పారిశ్రామిక ప్రగతికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, సోమవరపాడు వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.


పెదవేగి మండలం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు, ప్రముఖులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు, ఆహ్వాన పత్రికలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

ఇటీవల ఏలూరు జిల్లా ఏపీఎన్జీజీవోస్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించిన చోడగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు ఆధ్వర్యంలోని నూతన కార్యవర్గం కూడా ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరినాథ్‌తో పాటు పలువురు ఏపీఎన్జీవో సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వాటిని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.