కోటేశ్వర దుర్గాపురంలో రూ.11 లక్షల వాటర్ ప్లాంట్ ప్రారంభం… దాతల సహకారం అభినందనీయం: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


ఏలూరు జిల్లా, దెందులూరు: గ్రామాల అభివృద్ధిలో దాతల సహకారం ఎంతో అభినందనీయం అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన P4 స్పూర్తితో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరెంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు రూరల్ మండలం కోటేశ్వర దుర్గాపురం గ్రామంలో నెక్స్ట్ జెన్ సంస్థ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం సహకారంతో గ్రామ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో సుమారు రూ.11 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్ ను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు..


ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి, దాత సుబ్రమణ్యంకి స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు పూలమాలలతో శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. దాత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సొంత గ్రామం జాలిపూడి తో పాటు ఏలూరు రూరల్ మండలం పరిధిలోని సమీప గ్రామాల అభివృద్ధికి సైతం తమ సంస్థ తరఫున అండగా ఉంటామని ప్రజల త్రాగునీటి సమస్యలు తీర్చడానికి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే సమర్థవంతమైన ప్రభుత్వంతోపాటు దాతలు సహకారం కూడా ఎంతో అవసరమని, రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలని లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి4 కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఆ కార్యక్రమం స్ఫూర్తితో  మరెంతో మంది దాతలు అభివృద్ధి సంక్షేమాల కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని తెలిపారు.. స్వగ్రామం జాలిపూడితోపాటు ఏలూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల ప్రజల త్రాగునీటి సమస్యలు పరిష్కరించడానికి నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం అందిస్తున్న దాతృత్వ సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్వాన్నంగా ఉన్న రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తునే, మరోవైపు గంటల వ్యవధిలో ధాన్యం బకాయిలు చెల్లిస్తూ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా రైతన్నలకు అండగా నిలుస్తూ, తల్లికి వందనం, స్త్రీ శక్తి  వంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళా లోకానికి భరోసానిస్తూ, యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి సైతం కూటమీ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు సైదు సత్యనారాయణ, నేతల రవి, పైడిపాటి శేఖర్, పాపారావు, మరడాని రమేష్ సహా పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.