ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు - ఎంపీ పుట్టా మహేష్ కుమార్


- ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమాల కేసుల్లో ఉత్తర ప్రదేశ్ మొదటిస్థానం.
- నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలదే.
- IFMS ద్వారా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ.
- ఏలూరు ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం.

ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 12: దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వ, దారి మళ్లించడం వంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రైతులకు ఎరువుల సరఫరాలో అక్రమాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో  కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కు సంబంధించిన కేసులు అత్యధికంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లలో నమోదు అయినట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు. 

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పిన మంత్రి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్- నవంబర్ మధ్య దేశవ్యాప్తంగా 12,814 మంది ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంతోపాటు 5,835 డీలర్ల లైసెన్సులు రద్దు చేసినట్లు, 649 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 3,018 ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడం జరిగిందని,  ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాదిలో మొత్తంగా 105 ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు, 15 మంది డీలర్లపై FIR నమోదు అయిందని, 11 మంది డీలర్ల లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. 
‎ప్రతి ఏడాది పంటకాలం ప్రారంభానికి ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి రాష్ట్రాల వారీగా, నెలవారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేసి రాష్ట్రాలకు తగినంత పరిమాణంలో ఎరువులను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సబ్సిడీ ఎరువుల సరఫరా వ్యవస్థను "ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్మే నేజ్మెంట్ సిస్టం(IFMS)" ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 

నిత్యవసర వస్తువుల చట్టం 1955, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985 ప్రకారం అక్రమార్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.